ఆగ్నేయ ఇరాన్లో ఆదివారం నాడు ఓ ఆత్మాహుతి దాడి జరగడంతో ఇరవై మంది మృతి చెందారు.
ఆగ్నేయ ఇరాన్లో ఆత్మాహుతి దాడి జరగడంతో ఐదుగురు ఎలిట్ రెవల్యూషనరీ గార్డ్లతో సహా ప్రముఖ కమాండర్లతోసహా మొత్తం ఇరవై మంది మృతి చెందినట్లు ఇరాన్ లోక్సభ స్పీకర్ అలీ లారిజానీ తెలిపారు.
ఆదివారం జరిగిన దాడుల్లో భద్రతాదళాలకు చెందిన కమాండర్ జనరల్ నూర్ అలీ శుశాత్రీ, మరో కమాండర్ రజబ్ అలీ మొహమ్మద్ జాదేహ్ తదితరులున్నారని, వీరితోపాటు పలువురు తీవ్రగాయాలపాలైనారని ఆయన చెప్పారు.
మృతి చెందిన కమాండర్లు పాకిస్థాన్ సరిహద్దుల్లోనున్న పిశిన్ ప్రాంతంలో ఓ సమావేశంలో పాల్గొనేందుకు కారులో బయలు దేరి వెళ్ళారని, ఆ సమయంలో ఆత్మాహుతి దళానికి చెందిన సభ్యుడు తనను తాను పేల్చేసుకోవడంతో ఈ దుర్ఘటన జరిగిందని ఆయన వివరించారు.
ఇదిలావుండగా ఇప్పటివరకు ఈ దాడులకు బాధ్యత వహిస్తూ ఏ సంస్థ ప్రకటించలేదు. కాని ఈ దుర్ఘటన వెనుక సున్నీ ఉగ్రవాద సంస్థ జుందల్లా హస్తం ఉండొచ్చని, ఈ సంస్థ ఆగ్నేయ ఇరాన్లో రెవల్యూషనరీ గార్డ్, షియాలపై దాడులు చేసేందుకు పూనుకునుంటుందని భద్రతా దళాలు అనుమానం వ్యక్తం చేసాయి.
౦౧౨౩౪౫౬౭౮౯